Mayabazaar in Color,DTS and Scope

తెలుగు వారు ఇది మా సంపద అని సగర్వంగా చెప్పుకునే చిత్రం మాయాబజార్. ఇప్పుడు రంగుల్లో విడుదల అయిన ఈ సినిమా గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు.

విజయా వారి నిర్మాన సారధ్యానికి, కె.వి.రెడ్డి మరియు ఆనాటి అత్యున్నత సాంకేతిక నిపుణులు, ఆనాటి మహా నటులు తోడై వారి అత్యుత్తమ పనితీరుని ఇచ్చిన ఈ చిత్రాన్ని ఇప్పుడు రంగుల్లో చూపించడం చాలా సంతోషం. ఇప్పటి తరం వారికి పెద్దాయనని పెద్ద తెర మీద చూసే అధృష్టం లేదు. కాని ఈ చిత్రం ఆ అవకాశాన్ని కల్పించింది. రంగుల్లో ఉన్న ఈ చిత్రాన్ని చూడటం నిజంగా నాలాంటి సినీ ప్రేమికుల అధృష్టం.

చక్కని కథ, గొప్ప స్క్రీన్ ప్లే, రాజీ పడని నిర్మాణం, పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసే నటీనటులు, కనీ వినీ ఎరుగని కళా నైపుణ్యం, వీనుల విందైన సంగీతం, అబ్బుర పరిచే కెమెరా పనితనం.....వెరసి ఈ చిత్రాన్ని తరువాతి రోజుల్లో ఒక సినిమా తీయడాన్ని నేర్పే పాఠంగా తీర్చిదిద్దాయి.

ఒక భారీ చిత్రానికి రెండు లక్షల ఖర్చు అయ్యే ఆ రోజుల్లో ఈ చిత్రానికి ఆరు లక్షల వ్యయం అయ్యింది.

ఇప్పుడు ఆ చిత్రాన్ని వర్ణమయం చేసిన గోల్డ్ స్టోన్ టెక్నాలజీస్ శ్రమను మెచ్చుకోవలసిందే. సుమారు 2 సంవత్సరాల కృషికి తగిన ఫలితం వచ్చింది. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ప్రతీ ఫ్రేం కి రంగులను అద్దడం అంటే మామూలు విషయం కాదు. ద్వాపర యుగంలో ఉపయోగించిన రంగుల గురించి లోతుగా పరిశోధించారు. తరువాత 160 మంది కంప్యూటర్ నిపుణులు సుమారు 6 నెలలు కృషి చేసి ఒక అపురూప దృశ్యకావ్యాన్ని వర్ణరంజితం చేసారు. అక్కడక్కడ అవసరమైన చోట్ల చిన్న చిన్న గ్రాఫిక్స్ ను కూడా కలిపారు. డిజిటల్ సౌండ్ మరియు స్కోప్ చిత్రంగా మార్చారు. కలర్, స్కోప్, డి.టి.ఎస్. మిక్సింగ్ లకు గాను సుమారు 8 కోట్లు ఖర్చు అయినట్లు గోల్డ్ స్టోన్ సంస్థ మీడియా హెడ్ జగన్ మోహన్ తెలిపారు.

అక్కినేని నాగేశ్వర రావు గారు రంగుల్లో ఉన్న ఈ చిత్రరాజాన్ని చూసి గోల్డ్ స్టోన్ టెక్నాలజీస్ సంస్థను అభినందించారు. ప్రఖ్యాత దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు ఈ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు. ఈ చిత్రం లో బలరాముడి పాత్రధారి గుమ్మడి నాలుగు రోజుల క్రితమే స్వర్గస్తులైనారు. కొన్ని రోజుల క్రిందట ఆయన ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా తిలకించారు.

ఎన్.టి.ఆర్., ఎస్.వి.ఆర్., సావిత్రి , సూర్యకాంతం ,ఘంటసాల, రేలంగి,రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, ఛాయాదేవి, మాదవపెద్ది సత్యం, సాలూరి రాజేశ్వర రావు, ముక్కామల, సి.ఎస్.ఆర్., నాగభూషణం, బాలకృష్ణ, కెమెరా మెన్ మార్కస్ బార్ట్ లే, ఆర్ట్ డైరెక్టర్ మాదవపెద్ది ఘోకలే, పింగళి తదితర మిగిలిన ప్రధాన పాత్రధారులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ భౌతికంగా మన మద్య లేకున్నా ఈ చిత్రం ద్వారా వాళ్ళు ఎప్పటికీ సజీవంగా మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటారు. ఈ సందర్భంగా ఈ మహానుభావుల్ని స్మరించుకోవడం మన కర్తవ్యం.

సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి ఈ చిత్ర హక్కులను దక్కించుకున్నారు. 59 ప్రింట్లతో ఈ చిత్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా శనివారం విడుదల చేసారు.

ఎన్నటికీ వన్నె తగ్గనటువంటి ఈ సాటి లేని మేటి చిత్రాన్ని ఇప్పుడు రంగుల్లో చూడటం కన్నులకు అసలైన పండుగ. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూసి తరించండి.

0 comments:

Post a Comment